చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని ‘ఉద్యమ్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు.
శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు
తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం.
ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు.
మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, లేబులింగ్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ లింకేజీలు.
లైఫ్ టైమ్ వ్యాలిడిటీ:జిల్లా ఈడీసీ మేనేజర్ ఎం. శ్రీలత మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ (MSME) ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అవుతుందని, మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసక్తి గలవారు udyamregistration.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
ఉచిత సర్టిఫికెట్..
డీపీఎం శంకర్ మాట్లాడుతూ.. సీఐఎఫ్, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలతో జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం యూబీఐ మేనేజర్ అజయ్ మాట్లాడుతూ, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని, బకాయి ఉన్న సంఘాలు ఈ నెల 20లోపు క్లియర్ చేయాలని కోరారు.
ఏపీఎం ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ, భారత పౌరసత్వానికి ఆధార్ ఎంత ముఖ్యమో, వ్యాపార అభివృద్ధికి ‘ఉద్యమ్ ఆధార్’ అంత ముఖ్యమని పేర్కొన్నారు. వీఓఏలు ఉచితంగా ఈ సర్టిఫికెట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారని, దీని కోసం ఆధార్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. ప్రక్రియలో భాగంగా వచ్చే ఓటీపీని (OTP) అందించి సభ్యులందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి శారద, కోశాధికారి శిల్ప, సీసీలు సురేశ్, నర్సయ్య, శ్రీలత, స్త్రీనిధి మేనేజర్ కపిల్, అకౌంటెంట్ జయంతిక, ఆపరేటర్ నాగరాజు మరియు వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.








