కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వి.డి. సతీషన్ (V.D. Satheesan) ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గత పది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ, పార్టీ అధిష్టానం సతీషన్ వైపే మొగ్గు చూపింది.
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కె.సి. వేణుగోపాల్
ఈ పదవి కోసం రేసులో ఉన్న మరో కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, పార్టీ నిర్ణయంపై స్పందించారు. సతీషన్ ఎంపిక పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తాను” అని ఆయన ప్రకటించారు.
సుదీర్ఘ కసరత్తు.. సతీషన్ వైపే మొగ్గు..
కేరళ ఎన్నికల్లో యుడిఎఫ్ (UDF) విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, యువతలో ఉన్న ఆదరణ దృష్ట్యా సతీషన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
సీనియర్ నేతల మధ్య విభేదాలు రాకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని హైకమాండ్ సూచించింది.
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతూ, సతీషన్ సారథ్యంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుంది. త్వరలోనే ఆయన గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు








